హైదరాబాద్, వెలుగు: క్రిప్టో ఎక్స్చేంజి జియోటస్ రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కు మొగ్గు చూపే ఇన్వెస్టర్ల కోసం ‘సిప్’ ఫీచర్ను, వివిధ సెగ్మెంట్లలోని క్రిప్టోలను చూపే ‘బాస్కెట్’ ఫీచర్ను కంపెనీ యాడ్ చేసింది. 2018 లో లాంచ్ అయిన జియోటస్, దక్షిణాది రాష్ట్రాల్లో బాగా విస్తరించింది. రూ. 100 నుంచే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం కలిపిస్తోంది. జియోటస్లో 112 క్రిప్టోలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ సీఈఓ విక్రమ్ సుబ్బురాజు పేర్కొన్నారు. క్రిప్టోలను తమ ఎక్స్చేంజిలో లిస్ట్ చేసేటప్పుడు వివిధ సేఫ్టీ విధానాలను పాటిస్తామని చెప్పారు. ప్రస్తుతం 10 లక్షల మంది కస్టమర్లు తమ సొంతమని చెబుతున్న ఆయన, ఇందులో మూడు లక్షల మంది కస్టమర్లు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అన్నారు. తమ ప్లాట్ఫామ్లో నెలకు రూ. 500 కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయని చెప్పారు. తమ ఎక్స్చేంజిల్లో జరిగే ట్రేడింగ్ వాల్యూమ్స్లలో 40 శాతం బిట్కాయిన్వే ఉంటున్నాయని అన్నారు. 10–15 శాతం ఎథరియంకు చెందిన ట్రాన్సాక్షన్లు ఉంటున్నాయని పేర్కొన్నారు. దేశంలో క్రిప్టో ఇండస్ట్రీ మరింత ఎదుగుతుందని, ప్రభుత్వం రెగ్యులేషన్లు పెట్టాలని కోరుకుంటున్నామని సుబ్బురాజు అన్నారు.
